Shivalayam temple famus in golankonda village temple inunder the killa this is very grate temple charitrakaka kattadalu.గొలనుకొండః
ఓకప్పటి కొలనుకొండే ఇప్పటి గొలనుకొండ. యాదాద్రి-భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గ్రామం గొలనుకొండ. ఈ వూరిలోని అండాకారపు గుట్ట చాలా ఎత్తుగా వుంటుంది. దీనికి దక్షిణాన ఒకప్పుడు చాలా పెద్ద మెట్లకోనేరు వుండేదట. ఇపుడు దాని ఆనవాలుగా గుట్టకానుకుని రాతిద్వారం వుంది.
పాతవూరు పాటిగడ్డ వూరికి పడమట దండకుంటకు ఎదురుగా వుంది. అక్కడ కొంతకాలం కిందటిదాక 4పెంకుటిండ్లు వుండేవట. ఈ దండకుంటకు దక్షిణపు అంచున వున్న రెండునిలువుల బండరాయిమీద చెక్కిన రాతలున్న దీన్ని ‘లెక్కలగుండు’ అని గ్రామస్తులు పిలుస్తారు. ఈ గుండును గతంలో నేను,విరువంటి గోపాలకృష్ణగారితో, విరువంటి గోపాలకృష్ణ పివి పరబ్రహ్మశాస్త్రిగారితో చూడడం జరిగింది. పరబ్రహ్మశాస్త్రి లెక్కలగుండు మీది రాతలను గ్రామంలోని భూమి కొలతలలెక్కలు కావచ్చన్నారు. కాని, ఆ రాతలను అచ్చుతీయలేదు. ఇప్పుడేమో తీయడానికి వీల్లేకుండా దండకుంటకు పోసిన కొత్తమట్టికట్ట లెక్కలగుండును ముంచేసింది. గొలనుకొండగుట్టకు పడమటివైపు గుహాలయం వుంది. దీన్లో శంభులింగేశ్వరదేవాలయం వుంది. ఉత్తరంవైపు ఎత్తుతక్కువున్న గుహలో ప్రతిష్టించబడిన 1అడుగు కైవారమున్న శివలింగం, మీటరున్నర పొడువున్న చతురస్రాకారపు పానవట్టం వున్నాయి. అంతరాళం వలె వున్న గుడిముందర భాగంలో చిన్నదీపస్తంభం వుంది.
గుహలో రెండవవైపు దక్షిణంగా (ఆ రెంటిమధ్యన గోడలేవీ లేవు.) రాతిగోడలోనే తొలిచిన ఎత్తైనగద్దెమీద ఎడమవైపు నుంచి వరుసగా నంది, అర్ధనారీశ్వరుడు, గణపతుల అర్ధశిల్పాలున్నాయి. అర్ధనారీశ్వరశిల్పం ఈ ప్రాంతంలో లేదు. లలితాసనంలో కూర్చున్న ఈశ్వరీ, ఈశ్వరుల అర్ధనారీశ్వరశిల్పంలో గొప్పశిల్పకళ ఉట్టిపడుతున్నది. శివుని అర్ధభాగం కిరీటం,జటలు, చెవికి కుండలం, సగం మీసం, కుడివెనక చేతిలో త్రిశూలంతో, కుడి ముందరచేయి అభయహస్తంగా, నిలిపివుంచిన కుడికాలుకు కడియం, నడుముపై కటివస్త్రంతో కనిపిస్తుంది. ఈశ్వరి అర్ధభాగం కిరీటం, సిగ, చెవికి కర్ణాభరణాలు, మెడలో కంఠహారం,ఎడమ వెనకచేతిలో జింక, ఎడమ ముందరిచేయి ఎడమ మోకాలిమీద ఆన్చివుంది. ఎడమరొమ్ము, ఎడమచేతికి గాజులు,కంకణం,హస్తాభరణాలు, మడిచిన ఎడమకాలు,కాలికి కడియం, పాంజీబు, ఎడమవైపున చీరెవున్నాయి. అర్ధనారీశ్వరుని మెడలో కపాలమాల వుంది. దేవతాధిష్టానపీఠంపై మూడు సింహాలున్నాయి. ఈ అధిష్టానపీఠం జైన మహావీరుని అధిష్టానపీఠాన్ని పోలివుంది. ఇది కాపాలికులు లేదా పాశుపతులు జైనం మీద తమ ప్రాభవాన్ని తెలిపే గుర్తుగా చెక్కారా లేక అర్థనారీశ్వరుని శిల్పలక్షణ (iconography) మా? సందేహం. అంబ లేదా దుర్గ వాహనం సింహం. సింహం జైనతీర్థంకరులలో మహావీరునికి కూడా వాహనం. ఇక్కడ 3 సింహాలు జైనశైలిలో అధిష్టానపీఠంపై చెక్కివుండడం ఆలోచనీయం. అర్థనారీశ్వరునికి ఎడమపక్కన గణపతి శిల్పం కూడా అందంగా అర్ధనారీశ్వరునికి సమానమైన ఎత్తులో చెక్కివుంది. శిల్పశైలి సమానం. కరండమకుటం, చేటచెవులు, ఎడమచేతిలోని ఉండ్రాయితీసుకుంటున్న ఎడమవైపుకు తిరిగిన తొండం, కుడి ముందరచేతిలో ఉండ్రాయి లేదా ఫలం, కుడివెనకచేతిలో గొడ్డలి, ఎడమవెనకచేతిలో పాశం, వక్షంపై జంధ్యం, పొట్టమీద నాగబంధం, లలితాసనంలో కూర్చుని వున్నాడు వినాయకుడు.
గణపతికి కిందుగా దక్షిణపు రాతిగోడకు భూమట్టానికి సమాంతరంగా చెక్కిన సప్తమాతృకలు చెక్కబడివున్నారు. వీరి కిరీటాలు స్తుపాకారంలో వున్నాయి. అందరు చతుర్భుజులే. మాతృకలందరు వీరాసనంలో కూర్చొనివున్నారు. వాహనాలు స్పష్టంగా కనిపించడంలేదు. అర్ధనారీశ్వరశిల్పానికి కుడిపక్కను నందికి అవతల రాతిగద్దెమీద నిలబెట్టివుంచిన ఒక వీరగల్లు వుంది. దానికి కుడిపక్కన అందమైన సూర్యవిగ్రహం వుంది.ఎరుపురంగు ఇసికరాతిలో చెక్కివున్న ఈ శిల్పం ఈ ప్రాంతంలో (ఆలేరులోని చండికాంబ దేవాలయంలో కూర్చునివున్న సూర్యశిల్పం వుంది) అరుదైనదే.
ఈ గుడికి ముందర ముఖమంటపాన్ని తర్వాతికాలంలో నిర్మించినట్టుగావుంది. అందులో ఒక ఉపాలయం వుంది. ఈ గుడిలో ముచికుందమహాముని విగ్రహముండేదట. ఇపుడు లేదు. కాని, ఆ స్థానంలో ప్రతిష్టించబడని త్రిభుజాకార శీర్షం కలిగిన ఫలాలు పట్టుకున్న రెండుచేతులే వున్న ఒక అమ్మదేవత శిల్పం వుంది. శివాలయానికి ఉత్తరాన శిథిలదేవాలయం వుంది.దానిలో గరుడవాహన శిల్పమున్న దేవతాధిష్టానపీఠం వుంది.దానిపై వుండాల్సిన గోపాలస్వామి విగ్రహం గుడిపక్కన తలలేకుండా నిలబెట్టివుంది. అందమైన నల్లనిరాతిలో చెక్కినశిల్పంలో గోపాలునికిరువైపుల చామరధారిణులు,గోవులు చెక్కబడ్డారు. తలవరకేవున్న ఈ శిల్పానికి తల,చేతులు విరగ్గొట్టబడివున్నాయి. గుడిపక్కన గుండుమీద 3వరుసల్లో ఒక శాసనం వుంది. శాసనంలో ‘పరీధావి సంవత్సర శ్రావణ శుద్ధ విదియ బుధవారం నాడు పోగరి గోపరాజు వారి దేశరాజు గోపాలస్వామికి’ ఏదో సమర్పించినట్లుగా వుంది. ఇది ఏ పరిధావి సంవత్సరమో పరిశోధించవలసివుంది. ఇక్కడి కొంచెం ఎత్తులో కొండరాతిగోడకు చెక్కిన పన్నిద్దరాళ్వారుల అర్ధశిల్పాలున్నాయి. వాటిమీద శిథిలాక్షరాలలో రెండుపంక్తుల శాసనముంది. కాని, కొన్ని పొడి,పొడి అక్షరాలే తప్ప అర్థమిచ్చే పదాలు అగుపించడం లేదు. అక్కడికి తూర్పుగా కొండపైకి వెళ్ళే చోట గోపాలస్వామి సన్నిధి వుంది. అక్కడ పూర్వం ఒక వైష్ణవాచార్యుడు తపస్సు చేసేవాడని ప్రజలు చెప్పుకుంటారు. ఈ గ్రామానికి సమీపంలో వున్న జీడికల్ పూర్వం వైష్ణవపీఠంగా వుండేది. అక్కడనుండి గొలనుకొండ, అమ్మనబోలు, సాయిగూడెం, ఆలేరు, శారాజిపేట, సుద్దాల, బ్రాహ్మణపల్లిలలో గొలుసు వైష్ణవదేవాలయాలు కనిపిస్తాయి.
గుడి ముందర అక్కడ నేలలో దొరికిన పదిదాకా నాగశిల్పాలున్నాయి. అందులో ఒకటి సున్నపురాతిలో చెక్కిన నాగశిల్పం 1,2 శతాబ్దాలనాటిది. శంభులింగేశ్వరుని గుడిలో శివలింగం వెనకవైపు రాతిగోడలేదు. కాని, విష్ణుకుండినులనాటి పొడవైన ఇటుకలతో, డంగుసున్నంతో కట్టబడిన గోడవుంది. గుడివెనకవైపు సొరంగమార్గం, గుహ వున్నాయి. ఆ గుహలో ఒకరాతిగుండుమీద చెక్కిన 5 శివలింగాలున్నాయి. వాటిలో దక్షిణంవైపున్న శివలింగం సోమసూత్రం(అభిషేకజలం వెళ్ళే పానవట్టం కాలువ) దక్షిణం దిక్కు వుంది. మిగిలిన 4లింగాల సోమసూత్రాలు తూర్పు దిక్కుకు వున్నాయి. వాటివెనక వున్న గుహలో పదులకొద్ది ఎర్రని రంగులో టెర్రకోట మట్టిపూసలు గ్రామస్తులకు దొరికాయి. అక్కడనుంచి దక్షిణంవైపు దూరివెళ్ళేవిధంగా సొరికె వుంది. గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర అడుగు ఎత్తున్న ముదురాకుపచ్చరంగు రాతిలో చెక్కిన చతుర్భుజ కపాలభైరవుని విగ్రహం వుంది.
గ్రామానికి పడమటవున్న దండకుంటకు కొంచెం దూరంగా రాకాసులబండలు అని స్థానికులు పిలుచుకునే పెదరాతియుగంనాటి సిస్టుసమాధులున్నాయి. వందలాదిగా వుండేవని కాని,ఇపుడు ఆనవాళ్ళు మాత్రమే మిగిలివున్నాయి. అట్లే వూరికి తూర్పున అనంతారం తొవ్వలో దారికటు, ఇటు చెలకల్లో సిస్టుసమాధుల ఆనవాళ్ళుగా రాతిసలపలు, రాతిగుండ్లు కనిపిస్తున్నాయి. గతంలో ఈ సమాధుల్లో ఒక సమాధిని తవ్వినపుడు అందులో నుండి కుండలు, ఇనుప పనిముట్లు దొరికాయని గ్రామస్తులు చెప్పారు. గొడ్డండ్లు, బొరిగెలు, వడిసెలరాళ్ళు, రొట్టెలకోలలు వంటి రాతిపనిముట్లు కూడా దోరికినావి. గొలనుకొండగుట్టమీదికి వెళ్ళినపుడు పైన రాతిబండల నడుమ పడివున్న నల్లని కుండపెంకులు(NBP&W) దొరికాయి.
గొలనుకొండ గ్రామం పురాతనకాలం నుండి మానవావాసంగా వుందని చెప్పడానికి ఈ గ్రామం బయటవున్న మెగాలిథిక్ సమాధులు, రాతిపనిముట్లు సాక్ష్యమిస్తున్నాయి.అంతేగాక శివాలయం వెనక గుహలో లభించిన మట్టిపూసలు, అడుగుపొడుగు ఇటుకలు శాతవాహనకాలానికి, గుడివెనక డంగుసున్నం, మూరెడుపొడవున్న ఇటుకలతో కట్టిన గోడ విష్ణుకుండినుల కాలానికి తిరుగులేని గుర్తులు. శివలింగం, దానిపానవట్టం అసాధారణంగా వున్నాయి. ఈ ప్రాంతంలోని కాచారం,దిలావర్ పూర్ గ్రామాల్లో ఇంతపెద్దలింగాలను చూడవచ్చు. గొలనుకొండకు పడమటినుండి దక్షిణంగా ప్రవహించే ఆలేటివాగు(భిక్కేరు) పారుతున్నది. ఈ దేవాలయం యొక్క అబివృద్దికి సకరించగలరు.
|